ఆలూ కొత్తిమీర రైస్‌

కావాల్సిన పదార్థాలు:-
బియ్యం- ఒక కిలో,
బంగాళదుంపలు- అరకిలో,
కొత్తిమీర-రెండు కట్టలు,
పచ్చిమిర్చి-100గ్రా,
ఉప్పు-తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:- ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి.
బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసుకుని నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకోవాలి.
బాగా కాగాక తరిగిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఐదునిమిషాలపాటు దోరగా వేగించుకోవాలి.
తర్వాత రుబ్బిపెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఆ అన్నంలో పై మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
నూనెలో ఎర్రగా వేగించిన బంగాళదుంప చక్రాల్ని అలంకరణ కోసం అన్నంపై పెట్టాలి.
దీన్ని ఉల్లిచట్నీ లేదా టమోటాపెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.